ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఇరు పార్టీల నేతలూ పోలవరం విషయంలో ఈ మధ్య మాట్లాడుతూనే ఉన్నారు. అయితే వీరిలో ఎవరు చెబుతోంది వాస్తవమో అర్థం కావడం లేదు. ఎవరి ద్వారా పోలవరానికి న్యాయం జరిగిందో తెలియడం లేదు. అయితే మాటలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కొర్రీలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే తాము అప్పటి లెక్కల ప్రకారం ఏం చెబితే అదే ఇస్తామని కేంద్రం అంటోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వమే పోలవరాన్ని పూర్తి చేయాలని చెబుతోంది. ఎందుకంటే ఇది ఖర్చు పెరిగిన నేపథ్యంలో ఎలాగైనా దీని బాద్యత కేంద్రంపైనే ఉందని చెబుతోంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దీనిపై మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఇప్పుడు పోలవరంపై ఇంత వివాదం నెలకొందని వైసీపీ చెబుతోంది. ఈ విషయంలో సీఎం జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారు.
ఇక తాజాగా దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 7లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అన్నారు. టీడీపీ హయాంలో పోలవరాన్ని 71 శాతం పూర్తిచేశామని స్పష్టం చేశారు. పోలవరం పనులు బాగున్నాయని అప్పట్లో నితిన్ గడ్కరీ అభినందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2019లో రూ.55 వేల కోట్ల అంచనాలను సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిందని, ఎంపీలు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇదే సమాధానం చెప్పిందన్నారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ నిర్మాణ వ్యయం పెరగడం సహజమని చంద్రబాబు అన్నారు. పోలవరంపై సీఎం జగన్ అవగాహనలేని రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
సీఎం జగన్కు అవగాహన లేకపోతే పూర్తిగా తెలుసుకోవాలన్నారు. అవగాహనారాహిత్యంతో రాష్ట్రానికి నష్టం చేయొద్దని సూచించారు. బాధ్యతారాహిత్యంగా చెత్త లెటర్లు రాస్తున్నారని విమర్శించారు. కేంద్రంతో మాట్లాడాల్సింది పోయి, మమ్మల్ని విమర్శిస్తున్నారని బాబు మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వందే తప్పని అంటున్నారు. మరి తప్పెవరిదన్నది తెలియాలంటే కేంద్రమే దీనిపై అప్పుడు ఏం జరిగిందో… ఇప్పుడు ఏం జరుగుతోందో చెప్పాలి.