కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో చాలా దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటూ అభ్యర్థులు నిర్వహించే ప్రచారం వల్ల వందలాది మంది చనిపోతున్నారు.
తాజాగా అమెరికాలో ఇదే జరిగిందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ప్రచారాల కారణంగా 700 మంది ప్రజలు కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వెల్లడించింది. ట్రంప్ ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఎన్నికల ర్యాలీలు ట్రంప్ నిర్వహించారని నివేదికలో పేర్కొంది. దీని వల్ల 30 వేల మందికి కరోనా సోకిందని.. ఇందులో 700 మంది తమ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యర్థి జో బైడెన్ తలపడుతున్న విషయం తెలిసిందే. ఇద్దరూ హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 3వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ విడుదల చేసిన ఈ నివేదిక సంచలనంగా మారింది. ముందు నుంచీ ట్రంప్ కరోనా విషయంలో అంత సీరియస్గా లేరు. ఆయన మాస్క్ కూడా పెట్టుకోలేదు. ఆ తర్వాత ఆయనకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.
ఎవ్వరికీ ఇవ్వని ట్రీట్మెంట్ ట్రంప్కు ఇచ్చి ఆయన 10 రోజుల్లోనే కోలుకునేలా చేశారు. ఇప్పుడు కరోనా ఉన్నా ఎన్నికల కోసం ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న 700 మంది చనిపోయినట్లు నివేదికలు బయటకు రావడం ట్రంప్కు మైనస్ అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.