ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం అమెరికాలో ప్రజలను మరింత భయపెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో అమెరికా అల్లాడిపోతోంది. కరోనా దెబ్బకు ప్రజలు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఏ క్షణమైన లాక్ డౌన్ విధిస్తారని అనుకుంటున్నారో ఏమో కానీ కావాలసిన సరుకులన్నీ ముందే కొనేస్తున్నారంట.
అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలో ప్రస్తుతం 1,20,85,389 కోవిడ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ కారణంగా 2,55,823 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర సరుకులను మితిమీరి కొనడం మళ్లీ ప్రారంభించారు. దీంతో దుకాణదారులు కొనుగోళ్ళపై పరిమితులు విధిస్తున్నారు. సరుకులు అందుబాటులో ఉంటాయని, భయాందోళనలకు గురికావద్దని ప్రజలను కోరుతున్నారు. క్లీనింగ్ ప్రొడక్ట్స్, టాయ్లెట్ పేపర్, కోల్డ్, ఫ్లూ మందులు, షెల్ఫ్ స్టేబుల్ ఫుడ్ వంటివాటిని ప్రజలు విపరీతంగా కొంటున్నారు. భారీ మాల్స్ స్టాక్ లెవెల్స్ను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాయి. కంప్యూటర్కు అనుసంధానం చేసిన ఇన్-స్టోర్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాయి. డిమాండ్కు తగినట్లుగా సరుకులను అందుబాటులో ఉంచుతున్నాయి.
ప్రజలు డిజిన్ఫెక్టెంట్ వైప్స్, క్లీనింగ్ స్ప్రేస్, డిస్పోజబుల్ గ్లోవ్స్, పేపర్ గూడ్స్, క్లీనింగ్ సప్లయ్స్ వంటివాటిని పెద్ద ఎత్తున కొంటున్నారు. కోవిడ్-19 మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ళ వద్దనే ఉండాలనే నిబంధనలను అమలు చేస్తే ప్రజలు ఆహారాన్ని దాచుకోవడానికి మరింత ఎగబడతారని నిపుణులు చెప్తున్నారు. హాలిడే సీజన్లో డిమాండ్కు తగినట్లుగా సరుకులను అందజేయగలమని కిరాణా సరుకుల దుకాణదారులు చెప్తున్నారు. కోవిడ్ వల్ల మాంసం ప్రాసెసింగ్కు అంతరాయం ఏర్పడినప్పటికీ, రెడ్ మీట్, పౌల్ట్రీ ఉత్పత్తులు పెరిగినట్లు అమెరికా వ్యవసాయ శాఖ చెప్పింది. పాడి పరిశ్రమ కూడా పుంజుకున్నట్లు తెలిపింది.