భారత్లో కరోనా కేసుల సంఖ్య నమోదవుతూనే ఉంది. అయితే కరోనా రికవరీ రేటు కూడా ఇండియాలో ఎక్కువగానే ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని కరోనా రికవరీ ఇండియాలో ఉంది. 93 శాతం మంది ప్రజలు కరోనా నుంచి కోలుకున్నారు.
అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 5,79,70,452కు చేరుకున్నాయి. వారిలో 13,78,839 మంది మరణించగా.. 4,01,84,355 మంది కోలుకున్నారు. దేశంలోని ఢిల్లీ, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాల్లో తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న వార్తలు మనం వింటున్నాం. అయితే ఎక్కడ కేసులు పెరిగినా దేశ వ్యాప్తంగా రికవరీ రేటు మాత్రం ఎక్కువగానే ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 90,50,597కి చేరింది. శుక్రవారం 46,232 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 84,78,124 మంది కోలుకోగా.. ఇంకా 4,39,747 మంది చికిత్స పొందుతున్నారు. 1,32,726 మంది మరణించారు.
అంటే మొత్తం కేసుల్లో 93.67 శాతం మంది కోలుకోగా.. 4.86 శాతం మంది చికిత్స పొందుతున్నారు. 1.47 శాతం మరణించారు. అయితే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. దీంతో రికవరీ రేటు క్రమేపీ పెరుగుతూ వస్తోంది. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా మరో వైపు రికవరీ రేటు బాగుండటం శుభపరిణామమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యాక్సిన్ వచ్చే లోపు రికవరీ రేటు 100 శాతం దగ్గరకు చేరువ కావాలని కోరుకుంటున్నారు.