ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నా ఇంకా ప్రతిపక్ష పార్టీలు అమరావతిపైనే ఆశలు పెట్టుకున్నాయి. అమరావతి రాజధాని మార్పుకు ఒక్క సహేతుకమైన కారణం చూపిస్తారా అంటూ తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. దీన్ని బట్టి ఇంకా తెలుగుదేశం రాజధాని మార్పు విషయంలో పోరాడాలని అనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
కనకమేడల మాట్లాడుతూ కేంద్రం నియమించిన కమిటీలతో పాటు పలు కమిటీల సిఫారసు మేరకే అప్పట్లో రాజధానిగా అమరావతిని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీకి వ్యతిరేకంగా రాజధాని నిర్మాణం చేపట్టారన్న దాంట్లో నిజం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన రాజధానిని నాశనం చేయాలని వైసీపీ చూస్తోందని ఆయన అన్నారు. ఇక రాష్ట్రపతి నోటిఫికేషన్తో హైకోర్టు ఏర్పడిందన్నారు. దీనికి వ్యతిరేకంగా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు.
రాజులు మారినప్పుడల్లా రాజధానులు మార్చాలని చట్టంలో ఉందా అని టిడిపి ప్రశ్నిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఈ కామెంట్ల వల్ల అమరావతి రైతులు ఇంకా రాజధాని ఉద్యమాన్ని కొనసాగించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తూ ముందుకు వెళుతోంది. కాగా ప్రతిపక్ష టిడిపి మాత్రం ఇంకా రాజధానిపై ఆశలు పెట్టుకున్నట్లు ఈ వ్యాఖ్యలతో అర్థం అవుతోంది. మరి ఈ విషయంలో అధికార పార్టీ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.