ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకునే ప్రభుత్వం పలువురికి జీతాలు ఇవ్వకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
కరోనా కేసులు విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఆయుర్వేద డాక్టర్లను ప్రభుత్వం తీసుకుందని ఆయన చెప్పారు. వీరికి నెలకు రూ. 70 వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పినట్లు తెలిసిందన్నారు. అయితే వీరికి మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఉన్నారని తమ దృష్టికి వచ్చినట్లు రఘురామ తెలిపారు. దీనిపై ఆయన మండిపడ్డారు. ఆయుర్వేద డాక్టర్లకు నెలకు రూ. 70వేలు ఇస్తామని చెప్పి తీసుకున్న ప్రభుత్వం వారికి జీతాలు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వారికి జీతాలు ఇవ్వాలని సూచించారు. జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటే.. రేపు రాబోయే రోజుల్లో స్కీంల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు అలవాటుపడ్డారని, ఒకేసారి సంక్షేమం ఆగిపోతే ఇబ్బందులు పడతారని అన్నారు. చిన్న చిన్న జీతాలు నిలిపివేస్తే.. సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయనే భయం ప్రజల్లో ఉంటుందన్నారు. జీతాలు ఇవ్వడంలేదని సిబ్బంది అడిగితే మిమ్మల్ని తీసేద్దామని అనుకుంటున్నామని, కరోనా తగ్గిపోయింది.. ఇంకెందుకు అని అన్నారని తెలిసిందని రఘురామ అన్నారు. కరోనా తగ్గినప్పటికి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షలు నిర్వహించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని ప్రభుత్వం చెప్పిందని, మరి కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి అండగా నిలిచి పని చేసిన వారికి జీతాలు ఇవ్వకపోతే ఎలా అని రఘురామ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రఘురామకృష్ణం రాజు వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ఆయన కొద్ది నెలలుగా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలో ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.