ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మాటకు మాట పెరిగిపోతోంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు వైసీపీ మంత్రులకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నారా లోకేష్ ఏం మాట్లాడినా వెంటనే మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు.
ఇటీవల నారా లోకేష్ వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆ తర్వాత వైసీపీ నేతలు కూడా నారా లోకేష్పై మండిపడ్డారు. ఇది అయిపోయిందిలే అనుకుంటే వివాదం అవుతూనే ఉంది. ఈ ఉదయం నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులను ఎగతాళి చేస్తే జగన్ను గోచీతో నిలపెట్టే రోజు దగ్గరలోనే ఉందని జోస్యం చెప్పారు. పోలవరం 70శాతం పూర్తయితే మీసం తీయించుకుంటానన్న ఆ మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారని, చేతకాని 22మంది ఎంపీల వల్ల పోలవరానికి రూ.30వేల కోట్లు నష్టమని వాపోయారు.
4వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయానికి మీటర్ల బిగింపు తగదన్నారు. చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారని, జగన్ ప్యాలెస్లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలని సూచించారు. కానీ మీటర్లను అంగీకరించమని, వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే వాటిని పీకేస్తామని హెచ్చరించారు. సైకిళ్లకు మీటర్లు కట్టి ఊరేగిస్తామని తేల్చి చెప్పారు. దీనిపై మంత్రులు కౌంటర్ ఇవ్వడం స్టాట్ చేశారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్పై ఫైర్ అయ్యారు. నారా లోకేష్ ఆరోపణలకు సమాధానం చెప్పడమే మా ఖర్మ అన్నారు. దేశంలోనే రైతుల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించిన నేత జగన్ అన్నారు.
జగన్ ఎవ్వరి పార్టీ లాక్కొని సీఎం కాలేదన్నారు. లోకేష్ ముందు ట్రాక్టర్ సరిగా నడపడం నేర్చుకోవాలని.. మీపార్టీ నేతలే నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. పోలవరం పనులు 70 శాతం పూర్తయితే మీసాలు తీసేస్తానన్న నేత ఎక్కడా అని మీసాలు లేని నేత మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ ట్రాక్టర్ నడపడం ఇంత వివాదం అవుతుందనుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.