ఆంద్రప్రదేశ్లో ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ లేనట్లే కనిపిస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల కమీషనర్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైకోర్టులో ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఓ న్యాయవాది వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ఇక్కడ ఎందుకు నిర్వహించకూడదని అడిగినట్లు తెలుస్తోంది. దీంతో కరోనా కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అయితే దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తెలపాలని ఎస్ఈసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 2వ తేదీకి వాయిదా వేసింది. అయితే అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నామినేషన్లు కూడా వేశారు. అంతలోనే కరోనా కేసుల దృష్ట్యా ఎన్నికల కమీషనర్ ఎన్నికలను వాయిదా వేశారు. కాగా హైకోర్టులో ఎన్నికలకు సంబంధించిన అంశం విచారణ జరుగుతుండటంతో రాజకీయ పార్టీలు ఆసక్తిగా చూస్తున్నాయి. కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.