భారత్లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందుకోసం తాజాగా భారత్లోనికి ఆయుధాలు పంపేందుకు ప్లాన్ వేసింది. అయితే దీన్ని ఇండియన్ ఆర్మీ సమర్ధవంతంగా అడ్డుకుంది. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంది.
నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం అక్రమంగా సరఫరా చేస్తున్న ఆయుధాలను భారత సైనికులు అడ్డుకున్నారు. జమ్ముకశ్మీర్లోని కిషన్ గంగ నదిలో ఆయుధాలతో పాటు మందు గుండు సామాగ్రిని ఉగ్రవాదులు ట్యూబ్లో పెట్టి భారత్లోనికి పంపేందుకు ప్రయత్నించారు. అయితే నిఘా కళ్లతో ఉన్న భారత సైన్యం ఈ దుర్చర్యను గుర్తించింది. ఆయుధాలను తాడు సహాయంతో నదిలో పంపుతున్నారు. రెండు బ్యాగ్గుల్లో ఏకే 47 తుపాకులు, 8 మ్యాగజీన్లు, 240 రౌండ్ల బుల్లెట్ ట్యూబ్లను గుర్తించారు.
ఇద్దరు అగంతకులు ఈ పని చేసినట్లు గుర్తించారు. అనంతరం అక్కడ ఇంకెవరైనా ఉన్నారా అని తనిఖీలు చేశారు. అయితే పాక్ ఇలాంటి దుశ్చర్యలు ఇంకా మానుకోలేదని సైన్యం చెబుతోంది. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయని.. అయితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి వచ్చేందుకు దాదాపు 300 మంది ఉగ్రవాదులు పన్నాగం పన్నుతున్నట్లు తెలిసింది. ఇండియాలోకి వచ్చి వీళ్లు విధ్వంసం సృష్టించాలన్న ఉద్దేశంతో వీరు వస్తుంటారు. అయితే సైన్యం ఎప్పటికప్పుడు వీటిని అడ్డుకుంటూనే ఉంది.