సరిహద్దులో చెలరేగిన వివాదంతో ఒక్కసారిగా భారత్, చైనాల మధ్య శత్రుత్వం పెరిగింది. ఎన్నిసార్లు చెప్పినా చైనా వక్ర బుద్ధిని చాటుకుంటూనే ఉండటంతో భారత్ కూడా తమదైన రీతిలో బుద్ది చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చైనా కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది.
వివాదాలు పరిష్కరించుకునేందుకు భారత్ చైనా ఓ వైపు చర్చలు జరుపుతున్న సమయంలో చైనా తన వక్ర బుద్దితో సరిహద్దులో బలగాలు మొహరించిన తీరు తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్ కూడా చైనాకు ధీటుగా అన్ని విధాలా సిద్ధంగా తయారైంది. ఏ క్షణమైనా చైనాను ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో సైనికులు నిరంతరం బోర్డర్లో సిద్ధంగా ఉన్నారు.
అయితే ఈ రెండు మూడు రోజుల్లో చైనా తన వైఖరిని కాస్త మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. సరిహద్దులో ఎలాంటి అలజడులు సృష్టించడం లేదు. ఇరు దేశాలు ఒకదానికొకటి గౌరవించుకొని, సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో అన్నారు. భారత్తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే చైనా ఇలా వ్యాఖ్యానించడానికి కారణం ప్రధాని మోధీనే.
స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా మోదీ చేసిన ప్రసంగంతో చైనా పునరాలోచించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ వైఖరి ప్రదర్శిస్తున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నియంత్రణ రేఖ నుంచి వాస్తవాధీన రేఖ వరకు దేశ సార్వభౌమాధికారంపై ఎవరైనా కన్నెత్తి చూస్తే వారికి అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పేందుకు సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన మాట్లాడారు. దీని తర్వాత చైనా పైన చెప్పిన విధంగా స్పందించింది.