ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ భారత్లో మాత్రం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇన్నాళ్లూ దేశంలో కేసులు పెరిగిపోతున్న తరుణంలో ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా నుంచి కోలుకుంటున్నవాళ్లు ఇండియాలోనే ఉన్నారని నివేదికలు స్పష్టం చేశాయి.
భారత్లో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య మొత్తం 53,08,015 కి చేరింది. అయితే వీటిలో మొత్తం 42 లక్షల మంది కరోనాను జయించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఇండియాలోనే ఎక్కువగా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 79.28 శాతానికి చేరింది. ఇంకా పది లక్షల పది వేల మంది మాత్రమే కరోనాతో పోరాడుతున్నారు.
కరోనా వ్యాక్సిన్ కోసం దేశాలు పోటీపడుతున్న ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో రికవరీ రేటు పెరగడం శుభ పరిణామంగా వైద్యులు చెబుతున్నారు. మరో ఆరు నెలలు గడిస్తే కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ప్రజలంతా రోగనిరోదక శక్తి పెంచుకోవడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇండియాలో కరోనా టెస్టులు కూడా ఎక్కువగానే చేస్తున్నారు. ఒక్క రోజులోనే 8,81,911 కరోనా పరీక్షలు చేశారు. ఇందులో 93,337 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఏదిఏమైనా వ్యాక్సిన్ లేని పరిస్థితుల్లో రికవరీ రేటు పెరగడం భారత్కు మంచి పరిణామమనే చెప్పాలి.