అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న వారికి కరోనా సోకి మొత్తం దావాణంలా వ్యాప్తి చెందుతోంది. ఎవరో ఒక్కరికి సోకిన కోవిడ్ ఏకంగా 177 మందికి పాకిపోయింది.
అమెరికాలోని మైన్ రాష్ట్రం మిల్లినోకేట్ పట్టణంలో ఆగష్టులో ఓ పెళ్లి జరిగింది. చర్చిలో జరిగిన ఈ పెళ్లిలో యాబై మందికే పర్మిషన్ ఉండగా 65 మంది హాజరయ్యారు. వివాహం పూర్తయిన పది రోజుల తర్వాత 24 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టగా ఆందోళన కలిగించే అంశాలు బయటకు వచ్చాయి.
పరిమితికి మించి పెళ్లికి హాజరైన వారి వల్లే ఈ కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్నాయని గుర్తించారు. కరోనా కేవలం పెళ్లికి వచ్చిన వారి ద్వారా 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల వారికి కూడా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ పెళ్లికి హాజరైన వారి ద్వారా మొత్తం 177 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. అనుమతి లేకున్నా వివాహానికి పరిమితిని మించి బంధువులు రావడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతున్న నేపథ్యంలో మిల్లినోకేట్ పట్టణాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం ఎంత చెబుతున్నావినకుండా.. వెనకా ముందూ చూసుకోకుండా నిబంధనలు పాటించకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్న వారికి ఈ ఘటన ఓ గుణపాఠంలా చెప్పొచ్చు.