ముంబైలో భారీ డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టయింది. ఆప్ఘనిస్తాన్ నుంచి ముంబై తీసుకొస్తున్న 191 కేజీల డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆప్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులకు అందిన సమాచారంతో వీటిని చాకచక్యంగా పట్టుకున్నారు.
దేశంలో అన్ని ప్రాంతాలకు డ్రగ్స్ ముంబై నుంచే వెళతాయి. ఖండాంతరాలు దాటి ముంబైకి ఈ డ్రగ్స్ చేరుకుంటాయి. గతంలో ఎన్నోసార్లు అధికారులు ఈ డ్రగ్స్ సరఫరాను పట్టుకున్నారు. అయినా వీరు ఈ దందాను ఆపడం లేదు. డ్రగ్స్లో ఎల్.ఎస్.డి, ఎం.డి.ఎం.ఏ ఈ రెండు చాలా ఖరీదైన డ్రగ్స్. వీటి ఒక గ్రాము విలువ రూ. 4 నుంచి 5 వేలు, 10 వేలదాకా ఉంటుంది.
ఈడ్రగ్స్ ఇండియాలో తయారయ్యే పరిస్థితులు లేవు. వీటిని ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ఇండియాలో ముంబై కేంద్రంగా వీటిని విక్రయిస్తారు. ముంబై నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూంటారు. అయితే డ్రగ్స్ వ్యాపారంపై అధికారుల నిఘా ఎక్కువవుతున్న నేపథ్యంలో అక్రమార్కులు అత్యంత జాగ్రత్తగా వీటిని తీసుకొస్తారు. కస్టమర్లకు విక్రయించే సమయంలో కూడా కోడ్ను వాడతారు.
గతంలో డ్రగ్స్ పట్టుబడిన సందర్బాల్లో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కస్లమర్లకు డ్రగ్స్ ఇవ్వాలంటే వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొన్ని కోడ్ భాషలు ఉపయోగించి ఇవి అమ్ముతారు. తాజాగా నేడు వెయ్యి కోట్ల విలువ చేసే డ్రగ్ పట్టుబడింది. ముంబైలో ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా వీటిని చాకచక్యంగా తరలిస్తున్నారు. ప్లాస్టిక్ పైపులకు రంగులు పూసి వెదురు బొంగుల్లా కనిపించేలా వీటిని తరలిస్తున్నారు. నేడు పట్టుబడిన డ్రగ్స్ కేసులో ఇద్దర్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు.