కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో పండుగలు రావడం అత్యంత క్లిష్టసమయమని మేధావులు చెబుతున్నారు. ప్రజలంతా ఒక్కచోట గుమిగూడకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఇక షాపింగ్ కాంప్లెక్సులు, మార్కెట్లు ఇతర ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించి వీలైనంత దూరం సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
ఈ కరోనా నిబంధనలు పాటిస్తూనే షాపింగ్ కాంప్లెక్సులు నడపాలని అధికారులు నిబంధనలు పెట్టారు. చెన్నైలో ఈ నిబంధనలు ఉల్లంఘించిన షాపింగ్ కాంప్లెక్స్పై చర్యలు తీసుకున్నారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన చెన్నైలోని కుమరన్ సిల్కుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీలు వేశారు. దసరా పండుగకు ముందే బహుళ అంతస్తుల షోరూమ్ అయిన కుమరన్ సిల్కులో పెద్ద ఎత్తున జనం గుమిగూడిన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. చెన్నైలోని టీనగర్ లో ఉన్న కుమరన్ సిల్కు షాపులో కొవిడ్-19 నిబంధనలు పాటించనందువల్ల మూసివేశామని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు.
పబ్లిక్ కూడా రద్దీ ప్రాంతాల్లో తిరగడం మానుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించని ఇతర దుకాణాలను కూడా మూసివేస్తామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ట్వీట్లో హెచ్చరించింది. షోరూమ్ లో చాలామంది ప్రజలు ఫేస్ మాస్కులు ధరించలేదు. షోరూంలోఎక్కువమంది వినియోగదారులను అనుమతించవద్దని చెన్నై కమిషనర్ జి. ప్రకాష్ చెప్పారు. జనం రద్దీని నియంత్రించడంతో శానిటైజర్లు, ఫేస్ మాస్కులు పెట్టడంతోపాటు సామాజిక దూరం పాటించాలని కోరారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మేరకు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.