తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రోగాల ముప్పు పొంచి ఉంది. ఎక్కడికక్కడే బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. ఇళ్ల చుట్టే నీళ్లు నిల్వ ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో రోగాలు విజృంభించే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అసలే కరోనా కాలం…ఈ సమయంలో ఇతర జబ్బులు వస్తే తీవ్రత అధికంగా ఉండే అవకాశముందని అంటున్నారు. ముంపు ప్రాంతాల్లో 70 శాతం మంది ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నట్లు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇటీవల ఓల్డ్ సిటీలో 300 మందిని సంప్రదించి ఈ సర్వేను నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది. వారందించిన వివరాల ప్రకారం 70 శాతం మంది దురదతో కూడిన ఫంగల్ ఇన్ఫెక్షన్లు, 10 శాతం మంది జ్వరం, ఒళ్లు నొప్పులతో, మరో 20 శాతం మంది నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నట్లు సర్వే ద్వారా తేలిందన్నారు.
ఇక ఫౌండేషన్ తరుపు నుంచి బాధితులకు ఫీవర్ కిట్లు, ఫీవర్ సర్వైలెన్స్ ఫార్మ్స్ అందజేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వారికి టెలీ మెడిసిన్ ద్వారా సేవలు అందిస్తున్నామని, అవసరమైన వారికి వైద్యం అందించి మందులు పంపిణీ చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకుడు అక్సారీ తెలిపారు. అత్యవసర వైద్యసేవలకు హెల్ప్లైన్ నంబర్లు 87906 79505లో సంప్రదించాలని కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కలుషిత నీరు, ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండాలని చెబుతున్నారు.