దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. పసికందులపై దాడులు చేస్తూ వారి జీవితాలను గాయ పరుస్తున్నారు. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది.
ఉత్తరప్రదేశ్లో ఘోరం చోటుచేసుకుంది. ఐదున్నరేళ్ల బాలికపై ఏడు సంవత్సరాల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలీగడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలుడిపై భారత శిక్షా స్మృతి 376, లైంగిక వేదింపుల నుంచి బాలలకు రక్షణ కల్పించే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట బాలుడిని హాజరు పరిచారు.
ఆడుకునే క్రమంలో బాలుడి ఇంట్లో పడిన తన బంతిని తీసుకొచ్చేందుకు బాలిక వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని వారు ఆరోపించారు. అయితే నిందితుడి వయసు 12 ఏళ్లకు మించకపోవడంతో అతడికి ఐపీసీలోని సెక్షన్ 83 కింద పాక్షిక రక్షణ లభించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్లో అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ రెండు నెలల కాలంలో వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.