అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికల ఉత్కంఠత ప్రపంచం మొత్తం ఉంది. ఇక అమెరికా ప్రజల్లో మరెంత టెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఈ సారి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీపోటీగానే ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఎవరు గెలుస్తారన్న ఆలోచనలోనే ఉండాలి. కానీ అమెరికాలో మాత్రం ఆ పరిస్థితి కనిపించ లేదు. ప్రజలంతా ఎన్నికల గురించి కంటే ఆహారం గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇది స్వయంగా గూగుల్ చెప్పింది. అమెరికాలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ ఏ ఆహారం కావాలో ఎక్కువగా నెట్లో వెతికారంట. పిజ్జా నియర్ మి, చైనీస్ ఫుడ్ నియర్ మి, లిక్కర్ స్టోర్ నియర్ మి, సుషి నియర్ మి, మెక్సికన్ ఫుడ్ నియర్ మి అని ఇలా గూగుల్లో వెతికారు. దీన్ని బట్టి ప్రజలు ఎన్నికల టెన్షన్ పక్కన పెట్టి ఫుడ్ గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో తెలుస్తోంది. అయితే ఎన్నికల టెన్షన్లో ఉన్న ప్రజలు రిలాక్స్ అయ్యేందుకు ఇలా ఫుడ్ తీసుకుంటున్నారని పలువురు చెబుతున్నారు. కాగా అమెరికాలో ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఎన్నికల కౌంటింగ్పై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయంచిన విషయం తెలిసిందే. ఇప్పటికీ తరువాతి అధ్యక్షుడు ఎవరనే దానిపై స్పష్టత రావడం రాలేదు. ఇంకా ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఈ రాష్ట్రాల ఫలితాలు వస్తే గానీ.. తరువాతి ప్రెసిడెంట్ ఎవరో తేలదు. దీంతో యావత్ ప్రపంచం తరువాతి వైట్హౌస్ బాస్ ఎవరు అనే విషయమై ఆసక్తిగా ఎదురుచూస్తోంది.