ఆంధ్రప్రదేశ్లో మంత్రులపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీ మంత్రులకు ధైర్యం లేదని అచ్చెన్న అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల విషయంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని అచ్చెన్నాయుడు మాట్లాడారు. కోర్టులో కేసులు వేసి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చేస్తున్నారని వైసీపీ మంత్రులు చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీకి చెందిన ఏ ఒక్క సభ్యుడైనా కోర్టుకు వెళ్లి కేసులు వేసినట్లు ఆధారాలు చూపించాలని అచ్చెన్న సవాల్ చేశారు. ఎస్సీ, ఎస్టీల భూములను ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకుందని.. దీంతో వాళ్లు కోర్టుకు వెళ్లారని ఆయన తెలిపారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని అన్నారు.
వైసీపీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలతో ప్రభుత్వం కేసులు వేయించిందని.. ఆ ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడే ధైర్యం మంత్రులకు లేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చాలా సమస్యలు ఉన్నాయని.. ఇవన్నీ సీఎంకు చెప్పే శక్తి లేక టీడీపీపై విమర్శలు చేస్తున్నారని, ఇళ్ల పట్టాలను టీడీపీ అడ్డుకుంటోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే ఇళ్ల పట్టాలను ఇవ్వడంలేదని ఆచ్చెన్నాయుడు ఆరోపించారు. కాగా ఏపీలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం సిద్దమవుతుంటే.. కోర్టుల్లో కేసులు వేసి స్టే తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం నేతలే కావాలని కేసులు వేసి ఇలా చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.