ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వైఖరి విచిత్రంగా ఉంది. పేద ప్రజల కోసం తాము పోరాడతామని చెప్పుకునే టిడిపి నేతలు అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని వైసీపీ చెబుతోంది. ఇందుకు ఉదాహరణలు కూడా వైసీపీ చూపిస్తోంది. అయితే ఇప్పుడు టిడిపి ఏపీ అధ్యక్షుడు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని వైసీపీ మేనిఫేస్టోలో పెట్టిందని అన్నారు. అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తి అయినా రాష్ట్రంలో ఒక్క ఇళ్లయినా నిర్మించారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియని, అధికారంలో ఎవరు ఉన్నా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. టీడీపీ హయాంలో 2లక్షల 62వేల ఇళ్లు నిర్మించి.. అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేశామన్నారు.
ఈలోగా ప్రభుత్వం మారిందని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అబ్దిదారులకు ఆ ఇళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. కానీ జగన్ ప్రభుత్వం ఇంత వరకు లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఉన్న ఇళ్లు ఇవ్వకుండా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తానని సీఎం జగన్ కొత్త నినాదంతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. పూర్తి అయిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కాగా అచ్చెన్నాయుడు ఇలా మాట్లాడటంపై రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంలో అడుగడుగునా టిడిపి అడ్డుపడుతూ కోర్టులను ఆశ్రయించింది. సాక్షాత్తు ఏపీ సీఎం జగన్ సైతం దీనిపై మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి పలువురు అడ్డుపడుతున్నారని అన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఏ నిర్ణయంలోనైనా టిడిపి విభేధిస్తూనే ఉంది. కోర్టులకు వెళ్లి ప్రభుత్వ నిర్ణయాలపై స్టేలు తెచ్చుకుంటోంది. ఇవన్నీ చేస్తున్న టిడిపి నేతలు పేద ప్రజల ఇళ్ల విషయం గురించి మాట్లాడటం బాగోదని రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. అయితే కేవలం రాజకీయాలు చేయడం కోసమే టిడిపి ఇలా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.