మీ దగ్గర రెండు లక్షల కంటే ఎక్కువ నగదు ఉందా..? రెండు లక్షలను మించిన క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారా..? అయితే మీరు డేంజర్ లో పడినట్లే. నగదు పరిమితి రెండు లక్షలు దాటిందో…మిమ్మల్ని నిఘా నేత్రం వెంటాడుతున్నట్లే లెక్క. నల్లధనాన్ని కట్టడి చేయడానికి మోడీ సర్కారు చేయని ప్రయత్నమంటూ లేదు. పెద్ద నోట్ల రద్దుతో మొదలు పెట్టి ..నగదు లావాదేవీల పరిమితిని రెండు లక్షలు చేయడం వరకు ఎంతో కసరత్తు చేసింది. పైగా క్యాష్ ట్రాన్సాక్షన్ రెండు లక్షలకు పైబడితే..100 శాతం జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ఈ ఆంక్షలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనల్ని ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు. ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. దీంతో ఈ ఉల్లంఘనపై ఆదాయపు పన్ను శాఖ సీరియస్ గా దృష్టి పెట్టింది. 2 లక్షలు దాటిన నగదు లావాదేవీలు అక్రమం అని చెప్పినా జనాలు పట్టించుకోకపోవడాన్ని ఐటీ శాఖ తీవ్రంగా తీసుకుంది. అందుకే మరోసారి అలాంటి వారికి వార్నింగ్ ఇచ్చింది. 2 లక్షలకు మించి నగదు వాడే వారి సమాచారాన్ని తమకు తెలపాలంటూ ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చింది. ఒక్కరోజులో గానీ, ఒక్క లావాదేవీలో గానీ ఎవరి మధ్యయినా రెండు లక్షల రూపాయలు క్యాష్ చేతులు మారితే…blackmoneyinfo@incometax.gov.in ద్వారా ఫిర్యాదు చెయ్యాలని కోరింది.