ఏపీలో కరోనా కేసులు వేల నుంచి వందలకు వచ్చేశాయి. ఇప్పుడు వందల్లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు వేగంగా చేపడుతోంది. ఈ నేపథ్యంలో మరో నెల లేదా రెండు నెలల్లో ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందన్న ఆశాభావం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 478 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో రాష్ట్రంలో 8,76,814కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,067 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 4,420 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,65,327 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా విశాఖలో ఇద్దరు, కడపలో ఒకరు కరోనాతో మృతి చెందారు.
వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా వ్యాక్సినేషన్కు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొదటి విడతలో వ్యాక్సిన్ వేయించుకునేవారిలో ఫ్రంట్లైన్ వారియర్స్, ఆరోగ్య సిబ్బంది, 50 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఉంటారని తెలిపారు. వీరందరూ లక్షల్లో ఉంటారని, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొద టి విడత వ్యాక్సినేషన్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మళ్లీ 4 వారాల తర్వాత రెండోసారి ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.