సరిహద్దులో చైనా, పాకిస్తాన్ ఎలాంటి పనులు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ముందు నుంచీ అదే పనిలో ఉన్నప్పటికీ.. చైనా మాత్రం ఇటీవల భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది. దీంతో ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు భారత్ చేయాల్సిన పనులన్నీ చేస్తోంది.
చైనా పాక్లపై గట్టి నిఘా పెట్టేందుకు భారత ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ దేశాలతో ఉన్న సరిహద్దుపై గట్టి నిఘా పెట్టేందుకు ఆరు ప్రత్యేక నిఘా విమానాలను సిద్ధం చేసే ప్రాజెక్టుకు కేంద్రం త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఆరు ఎయిర్ ఇండియా విమానాలకు ప్రత్యేక మార్పులు చేసి రాడార్ వంటి అత్యాధునిక నిఘావ్యస్థలను అమర్చేందుకు డిఆర్డీఓ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 10 వేల కోట్లకు పైగా అవుతుందని సమాచారం. త్వరలో కేంద్రం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సరిహద్దు వద్ద గట్టి నిఘా పెట్టడమే కాకుండా యుద్ధసమయాల్లో శత్రుదేశ సైన్యం కదలికలపై కూడా ఈ విమానాలు కన్నేయగలవు.
ప్రస్తుతం భారత నిఘా విమానాలు నెట్రా(NETRA) కంటే కూడా ఇవి అత్యాధునికమైనవని సమచారాం. అయితే..డీఆర్డీఓ గతంలోనే ఈ ఆరు నిఘా విమానాలు సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఇందుకు కోసం ఎయిర్ బస్ నుంచి ప్రత్యేకంగా ఆరు ఎయిర్ బస్ ఏ330 కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే..తాజాగా ఎయిర్ ఇండియా విమానాలనే వినియోగించాలనే నిర్ణయంతో ఈ కొనుగోళ్లకు బ్రేక్ పడింది. ప్రస్తుతమున్న ప్లాన్ ప్రకారం.. ఈ విమానాలు తొలుత యూరప్కు తరలించి అక్కడ వాటిల్లో రాడార్లతో పాటూ ఇతర నిఘా వ్యవస్థలను అమరుస్తారు.