కరోనా ఇంకా ప్రపంచ దేశాలు భయపెడుతూనే ఉంది. దీంతో దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్లో తలమునకలవుతున్నాయి. కరోనా క్లినికల్ ట్రయల్స్లో వాలంటీర్లు చాలా కీలకం. ఎందుకంటే తమ ప్రాణాలను పనంగా పెట్టి క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనాల్సి ఉంటుంది. బ్రిటన్లో ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి.
అక్కడ త్వరలో ప్రారంభం కాబోతున్న హ్యూమెన్ ఛాలెంజ్ ట్రయల్స్లో పాల్గొనేందుకు ప్రజలు తమంతటతాముగా ముందుకు వస్తున్నారు. ఈ ట్రయల్స్ కోసం ఇప్పటికే 2500 మంది తమపేరును నమోదు చేసుకున్నారు. రెండు వారాలపాటు జరిగే ఈ అధ్యయనంలో పాల్గొన్నవారికి రూ. 4 లక్షల(4 వేల పౌండ్లు) అందనుంది. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే ఈ ట్రయల్స్ తొలి విడతలో భాగంగా 30 ఏళ్లలోపు వయసున్న 90 వలంటీర్లకు నేసల్ స్ఫ్రే ద్వారా నేరుగా ముక్కులోకి టీకా ప్రవేశపెడతారు.
ఆ తరువాత వారికి కరోనా వైరస్ సోకేలా చేసి టీకా పనితీరును అంచనా వేస్తారు. అయితే..ఇది రిస్క్తో కూడుకున్న అధ్యయనం కావడంతో…18 నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న వారినే వలంటీర్లుగా ఎంపిక చేశారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరగనుంది. వలంటీర్లను రాయల్ ఫ్రీ హాస్పిటల్లో ఉంచి అత్యంత జాగ్రత్తగా పరిశీలించనున్నారు. కాగా.. ఈ అధ్యయనం కోసం బ్రిటన్ ప్రభుత్వం 33.6 మిలియన్ పౌండ్ల నిధులను కేటాయించింది. దుబాయ్ ఫార్మా కంపెనీ ఒపెన్ ఆర్ఫన్కు చెందిన అనుబంధ సంస్థ హెచ్వివో ఈ అధ్యయనాన్ని రూపొందించింది.
అయితే.. వలంటీర్లకు కావాలని వ్యాధి బారిన పడేలా చేసే హ్యుమెన్ ఛాలెంజ్ ట్రయల్స్ శాస్త్రరంగంలోకి కొత్తేమీ కాదని నిపుణులు తెలిపారు. మలేరియా, టైఫాయిడ్, నొరోవైరస్, జలుపు, ఇన్ఫ్లుయెంజా వంటి రోగాలకు చికిత్స, టీకాలను కొనుగొనేందుకు హ్యూమెన్ ఛాలెంజ్ ట్రయల్స్ వాడతారని నిపుణులు చెబుతున్నారు.