ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. రెండో సారి ఆయన ప్రధానమంత్రి అయిన సమయంలో ప్రజలంతా ఏక కంఠంతో జై కొట్టారు. అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయి. ప్రధాని అంటే వ్యతిరేకత చూపించే వాళ్లు బాహాటంగానే చెబుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 72వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంపై నెటిజెన్లు సెటైర్లు కురిపిస్తున్నారు. ఒకవైపు యూట్యూబ్లో డిస్లైక్తో విరుచుకుపడుతూనే మరోవైపు ఇతర సామాజిక వేదికల్లో ‘మోదీ వ్యర్థ ప్రేలాపణ ఆపండి’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముందుగా వచ్చిన ఊహగాణలకు తగ్గట్టుగానే మోదీ మన్ కీ బాత్పై నెటిజెన్లు తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో మోదీ మన్ కీ బాత్ వీడియోపై డిస్లైక్ల పరంపర మళ్లీ ప్రారంభమైంది. ఆ వీడియోకు వచ్చిన లైక్ల కంటే ఎక్కువ సంఖ్యలో డిస్లైకులు వస్తున్నాయి.
ట్విట్టర్లో అయితే ‘మోదీ బక్వాస్ బంద్ కరో’ (మోదీ వ్యర్థ ప్రేలాపణ ఆపండి) అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభం కాగానే ఈ హ్యాష్ట్యాగ్ ఇండియా ట్రెండింగ్లోకి వచ్చింది. ‘‘మోదీజీ.. మన్ కీ బాత్ కాదు, నెల రోజులకు పైగా రైతులు చేస్తున్న నిరవధిక నిరసనపై మాట్లాడండి’’ అంటూ ఒక నెటిజెన్ స్పందించగా, ‘‘దేశ ప్రజలు చెప్పే విషయాన్ని మోదీ వినరు.. కానీ ఆయన మన్ కీ బాత్ అందరూ వినాలి’’ అంటూ మరో నెటిజెన్ రాసుకొచ్చారు. రైతుల వ్యవసాయ చట్టాల విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకుంటోందని మేధావులు అంటున్నారు.