భారతదేశంలో ఆవులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో మనందరికీ తెలుసు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవులు ఎతో పవిత్రమైనవిగా భావిస్తారు. దీంతో ఆవుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది.
మధ్య ప్రదేశ్లో ఆవుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గం తొలి సమావేశం ఆదివారం జరిగింది. గోవు మంత్రివర్గానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వం వహిస్తున్నారు. హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, అటవీ శాఖ మంత్రి విజయ్ షా, వ్యవసాయ శాఖ మంత్రి కమల్ పటేల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి మహేంద్ర సింగ్ శిశోడియా, పశు సంవర్థక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ ఈ మంత్రివర్గంలో ఉన్నారు. ఆవుల పరిరక్షణకు ఈ మంత్రిత్వ శాఖలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలన్న లక్ష్యంతో ఈ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.
మధ్యప్రదేశ్లో గోవుల సంరక్షణకు ఆవు పన్నును ప్రవేశపెడ్తామని సీఎం శివ్రాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆదివారం గోపాష్టమి సందర్భంగా అగర్మాల్వా జిల్లా సలారియా గ్రామంలోని గోవుల అభయారణ్యంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవు పన్నుతో గోవుల కోసం షెట్లు ఏర్పాటు చేస్తామని చౌహాన్ తెలిపారు. ‘‘పౌష్ఠికాహారం కోసం అంతా కోడిగుడ్డును తినాలంటారు. అయితే.. ఆవుపాలను ప్రోత్సహించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఆయన వివరించారు. అంతకు ముందు ‘గోవు కేబినెట్’పై వర్చువల్గా నిర్వహించిన తొలి భేటీకి సీఎం అధ్యక్షత వహించారు. గోవులు, వాటి ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,200 గోశాలలు ఉన్నాయి. మరొక 2,400 గోశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.