ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన కేసులపై రేపటి నుంచి రోజువారి విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు నేడు జరిగిన విచారణలో ఈ విషయాన్ని ధర్మాసనం వెల్లడించినట్లు తెలుస్తోంది. ఏపీలో మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.
రాజధానిపై విచారించిన త్రిసభ్య ధర్మాసం మొత్తం 229 అనుబంద పిటిషన్లు ఉన్నట్లు తెలిపింది. వీటిలో మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన పిటిషన్లును ముందుగా విచారించనున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు ఆన్లైన్లోనే విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అవసరం అయితే ప్రత్యక్ష్య విచారణ జరిపి కీలక పత్రాలు పరిశీలించే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపారు. జస్టిస్ జే.కే మహేశ్వరి, జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం వీటిని విచారించనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులు పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్ష పార్టీలతో పాటు పలువురు కోర్టులో పిటిషన్లు వేశారు. రాజధాని తరలించడానికి వీల్లేదని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెబుతోంది. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అంశం తమ పరిధిలో లేదని.. రాష్ట్ర నిర్ణయమే రాజధాని ఎంపికలో ఉంటుందని తెలిపింది. కేంద్రం సహకారం మాత్రమే అందిస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో హైకోర్టులో రేపటి నుంచి రాజధాని పిటిషన్లపై విచారణ జరగనుంది.