విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం విషయంలో ఏపీ హైకోర్టు ఆసక్తికర విషయాలు చేసింది. కోవిడ్ కేర్ సెంటర్కు అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా ప్రమాదానికి బాద్యులే కదా అని వ్యాఖ్యలు చేసింది.
స్వర్ణ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేసింది. రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ హోటల్లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించింది. దీంతో నిబంధనలు పాటించలేదని ప్రభుత్వం రమేష్ హాస్పిటల్స్ విషయంలో సీరియస్గా ఉంది. నేడు చనిపోయిన బాదిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కూడా చెల్లించింది ప్రభుత్వం.
అయితే ఈ కేసులో రమేష్ హాస్పిటల్స్ అధినేత రమేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం నేడు రమేష్ బాబు పిటిషన్ను విచారించింది. ఈ సందర్బంగా రమేష్ తరపు న్యాయవాది మాట్లాడుతూ అధికారులు కోవిడ్ కేర్ సెంటర్కు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇక్కడ చాలా సంవత్సరాలుగా హోటల్ నిర్వహిస్తున్నట్లు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనలు విన్న ధర్మాసనం అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా ఈ విషయంలో బాధ్యులే కదా అని వ్యాఖ్యలు చేసింది.
అయితే ప్రభుత్వ తరుపు న్యాయవాది మాట్లాడుతూ కేసు విచారణ దశలో ఉందన్నారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో రమేష్ బాబుతో పాటు, చైర్మన్ సీతారామ్మోహన్ రావుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.