దేశ ప్రధాని నరేంద్రమోదీపై మక్కల్ నిధి మయమ్ అధినేత, నటుడు కమల్ హసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నూతనంగా పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ దీనికి శంకుస్థాపన కూడా చేశారు. దీనిపై కమలహాసన్ మండిపడ్డారు.
దేశ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా ఉన్న సమయంలో నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని చేపట్టడం ఎంత వరకు సమర్థనీయమని ప్రశ్నించారు. దేశంలోని ప్రజలు అర్ధాకలితో ఉన్న సమయంలో నూతన పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ఎందుకు కడుతున్నారని మండిపడ్డారు. వెయ్యి కోట్ల రూపాయలతో కొత్త భవనం నిర్మించడం అవసరమా అని ప్రశ్నించారు. చైనా గ్రేట్ వాల్ నిర్మాణం సమయంలో చాలా మంది మరణించారు. అయినా సరే… ప్రజలను కాపాడడానికే అని పాలకులు ప్రకటించారు. ఎవరిని కాపాడడానికి 1,000 కోట్లతో పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు.. దయచేసి చెప్పండి ప్రధాని గారు’’ అని కమల్ హసన్ ప్రశ్నించారు.