ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారిన అమరావతి భూ కుంభకోణం కేసులో విచారణ ఆపాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పేరు ఉంది. ఆయన అరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయనపై నమోదైన మరో కేసులో కోర్టు ఊరటనిచ్చింది.
ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య నాగారాణి, బావ మరిది నన్నపనేని సీతారామరాజులపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో రిటైర్డ్ లెక్చరర్ రాజ రామమోహన్ రావ్ అనే వ్యక్తి కేసు పెట్టారు. ఎందుకంటే తన వద్ద రెండు ప్లాట్లకు, ఒక స్థలానికి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఒకే ప్లాట్ రిజిస్ట్రర్ చేసి మోసం చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో విచారణ ప్రారంభించేందుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. ఈ లోపే పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ కొట్టివేయాలని నన్నపనేని సీతారామరాజు పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
వీళ్లపై నమోదైన కేసులో తదుపరి చర్యలన్నింటినీ రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఫిర్యాదు దారుడికి నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 13కి వాయిదా వేసింది. ఇప్పటికే అమరావతి భూ కుంభకోణం కేసులో ఏసీబీ విచారణ వద్దంటూ మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. మళ్లీ ఇంకో కేసులో ఏజీకి రెండు వారాల పాటు తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ చెప్పడం దమ్మాలపాటికి ఊరట లభించడమేనని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.