ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో జరిగిన ఘటన గురించి దేశం మొత్తం బాధపడుతుంటే పలువురు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలే దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. సొంత పార్టీ నేతలు చేస్తున్న ఈ ప్రకటనలతో పార్టీకి చెడ్డ పేరు వస్తోందన్న చర్చ నడుస్తోంది.
యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మాట్లాడుతూ కూతుళ్లకు మంచి బుద్దులు చెప్పాల్సిన బాద్యత ప్రతి తల్లిదండ్రిపై ఉందని చెప్పారు. అప్పుడు అత్యాచారాలు తగ్గుతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటి సంఘటనలు సంస్కారంతోనే తగ్గుతాయని ఇంకాస్త ముందుకెళ్లి మాట్లాడారు. తల్లిదండ్రులు అమ్మాయిలకు సంస్కారం నేర్పించాలన్నారు. ఇంతకంటే ప్రత్యామ్నాయం లేదన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరిగి దేశం మొత్తం అలజడి రేగింది. అలాంటిది అదే రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడటంపై దుమారం రేగుతోంది. ఇలాంటి ఘటనలు ఖండించాల్సిన ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులను బాదపెట్టేలా మాట్లాడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. అయితే ఈయన గతంలో కూడా పలువురిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదాస్పద ఎమ్మెల్యేపై బీజేపీ అధిష్టానమే చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంతా కోరుతున్నారు.