ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజధాని వికేంద్రీకరణ అంటూ అధికార పక్షం ముందుకు వెళుతుంటే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షం రాజీనామాల మాట ఎత్తుకుంది. అయితే తాను రాజీనామాలు చేయాల్సిన చంద్రబాబు.. అధికార పార్టీ నేతలు రాజీనామాలు చేయాలని 48 గంటల డెడ్లైన్ విధించడం ఇప్పుడు విడ్డూరంగా ఉంది.
మూడు రాజధానుల నిర్ణయంలో ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీ వైసీపీకి 48 గంటల డెడ్లైన్ విధించారు. ఈ లోగా అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని..ఆ తర్వాత తిరిగి ఎన్నికలకు వెళ్దామని చెప్పారు. చంద్రబాబు వైఖరిపై అందరూ నవ్వుకుంటున్నారు. అవసరమైతే చంద్రబాబు రాజీనామాలు చేయాలి కానీ.. అధికార పార్టీపై ఎందుకు ఆదారపడాలన్న చర్చ సాగుతోంది.
గతంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేశారు. కానీ ఇలా అధికార పార్టీ వాళ్లు రాజీనామా చేయాలని ఎప్పుడూ కోరలేదు. కానీ ఏపీలో ఇదే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు వై.ఎస్ జగన్, ఆయన తల్లి వై.ఎస్ విజయమ్మలు తమ పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరేందుకు సిద్ధపడిన 16 మంది ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకున్నారు.
అంటే తాము ఎంచుకున్న దారి సరైందని అనుకున్నప్పుడు పదవులు వదులుకొని ప్రజా క్షేత్రంలోకి వెళ్లి మళ్లీ తిరిగి గెలిచి చూపించాలి. ఇప్పుడు మాత్రమే కాదు దశాబ్దాల పాటు వెనక్కు వెళ్లి చూసినా ఇలాగే జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దీనికి బిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. మూడు రాజధానులు కరెక్టు కాదని చెబుతున్న చంద్రబాబు రాజీనామా చేసి గెలిచి ఆయన మాటను ప్రజలు నమ్ముతున్నారని నిరూపించుకోవాలే తప్ప ఇంకో మార్గం లేదు.
ఇక రాజధానుల మధ్య దూరం ప్రజలకు బారం అవుతుందని చెబుతున్న చంద్రబాబు మాటలు హాస్యాస్పదం. అసలు సామాన్యులకు రాజధానికి రావాల్సిన అవసరం ఏముంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన జరగడానికి ముందు ఇచ్చాపురం నుంచి హైదరాబాద్కు ఎలా వచ్చారంటున్నారు. ప్రజలను మభ్యపెట్టే వాదనలతో జనాన్ని మాయచేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న వాదన ఉంది. లక్షల కోట్లు పెట్టి ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమా.. ఇదే డబ్బుతో మూడు రాజధానులు పెట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడమా అన్న చర్చే ఇప్పుడు నడుస్తోంది.
మూడు రాజధానుల నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమేమో కానీ రాష్ట్ర ప్రజలంతా అనుకూలంగానే ఉన్నారు. ఎందుకంటే విశాఖలో పరిపాలనా రాజధాని, రాయలసీమలో న్యాయ రాజధాని రావడం అందరూ ఆహ్వానిస్తూనే ఉన్నారు. కేవలం టిడిపి మాత్రం ఇది కరెక్టు కాదని వాదిస్తోంది. మరి అపార అనుభవమున్న చంద్రబాబునాయుడుకు గతమంతా తెలుసు.. ఎలాంటి ఇబ్బందులు వస్తే ఏం చేయాలో ఆయనకున్న అనుభవమే చెబుతుంది. ఈ నేపథ్యంలో కేవలం తాను పోరాడలేక అధికార పార్టీని నిందించాలన్న ఉద్దేశంతోనే 48 గంటల డెడ్లైన్ విధించారని తెలుస్తోంది.