ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో యువతిపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బాదితురాలి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు పరామర్శించారు. అయితే ఆ కేసులో నిందితులకు అనుకూలంగా చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ కేసులో నిందితులు అమాయకులంటూ పలువురు బహిరంగంగనే మాట్లాడుతున్నారు. ఈ విషయంలో బారాబంకీకి చెందిన బీజేపీ నేత రంజీత్ బహదూర్ శ్రీవాత్సవ మాట్లాడుతూ నిందితుడితో ఆమె అక్రమ సంబంధం నడుపుతోందని, సెప్టెంబర్ 14న జొన్న చేనులోకి అతన్ని పిలుపించుకుందని సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా అలాంటి అమ్మాయిలు కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో మాత్రమే చనిపోయి కనిపిస్తారన్నారు. చెరుకు, మొక్కజొన్న, గుబురు పొదలు వంటి చోట్లలోనే ఇలాంటి వాళ్లు చనిపోవడం కనిపిస్తుందని, పంట పొలాల్లో ఎందుకు కనిపించరన్నారు.
బీజేపీ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ నేత అంతటితో ఆగకుండా ఆ కుర్రాళ్లు అమాయకులని, వారిని సకాలంలో విడుదల చేయకుంటే తీవ్ర మానసిక వేధనకు గురవుతారని చెప్పారు. వాళ్లు కోల్పోయిన భవిష్యత్తుకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందా అని ప్రశ్నించారు. ఒకవైపు ఈ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న పక్షంలో రాజకీయ నాయకులు ఇలా మాట్లాడటం కరెక్టు కాదని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ ఆయనకు నోటీసులు ఇస్తామన్నారు. అయితే యువతులపై దాడుల విషయంలో ఇష్టానురీతిన మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.