కరోనా మహమ్మారిని అరికట్టే విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ మండిపడుతోంది. దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఈ వ్యాఖ్యలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కరోనా మహమ్మారి విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానిని ముందే హెచ్చరించిందని ఆయన అన్నారు. లాహోర్ లిటరేచర్ ఫెస్ట్ వేదికగా థరూర్ భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ హెచ్చరికలను మోదీ పెడచెవిన పెట్టారని ఆయన ఆరోపించారు. ఆ సూచనలను ఆచరణలో పెట్టడంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. కోవిడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. కోవిడ్ను చాలా సీరియస్గా తీసుకోవాలని లేదంటే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ హెచ్చరించినా కేంద్రం వినలేదన్నారు.
ముస్లిం వర్గంపై బహిరంగంగా మూర్ఖత్వం ప్రదర్శించడం, వివక్షను చూపడానికి కేంద్రం తబ్లీగీ జమాతే కార్యక్రమాన్ని ఉపయోగించుకుందని థరూర్ ఆరోపించారు. మహమ్మారి కారణంగా దేశంలో మూర్ఖత్వం, పక్షపాతం బయల్దేరాయని, వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ వ్యాఖ్యాలను బీజేపీ తప్పుబడుతోంది. పాకిస్తాన్ కేంద్రంగా భారతదేశ పరువు తీయడానికి థరూర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తింది.