ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు మళ్లీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడుతాయని తెలుస్తోంది. ఈ మేరకు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా ఇప్పటికే ఇరు రాష్ట్రాలలో వర్షాలు భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈశాన్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా అల్పపీడనం మారిందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత 24 గంటలలో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది. గత వారం రోజుల నుంచి ఏపీ తెలంగాణాలో వర్షాలు దంచి కొట్టాయి. వరదలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు.
భారీ వర్షాల, వరదల ధాటి నుంచి ఇంకా కోలుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాతవరణ శాఖ సమాచారం మేరకు పలు చోట్ల బారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక కోస్తాంద్ర, హైదరాబాద్లో పరిస్థితులు ఇంకా సాదారణ స్థితికి రాలేదు. హైదరాబాద్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సీఎంలు కేసీఆర్, జగన్లు వరద ద్వారా ఏర్పడిన నష్టాన్ని పూడ్చేందుకు సహాయం చేయాలని కేంద్రానికి లేఖలు కూడా రాశారు. కాగా వరదల సమయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో రెండు రోజుల వర్షం అనడంతో ప్రజలంతా అలర్టుగా ఉండాల్సిన అవసరం ఉంది.