మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఇచ్చిన సాధారణ అనుమతిని మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలో సీబీఐ కేసుల దర్యాప్తు అధికారానికి అవరోధం ఏర్పడనుంది. ఏదైనా కేసులో దర్యాప్తును ప్రారంభించాలనుకుంటే సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
బీజేపీ, శివసేన మధ్య ఉన్న విభేదాలు మరింత ముదురుతున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణం రాష్ట్రంలో సీబీఐకి అడుగుపెట్టకుండా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. ఎందుకంటే సీబీఐకి రాష్ట్రాల్లో దర్యాప్తు చేసే అధికారం ఉంది. అయితే ఇక్కడే మరో చిక్కు ఉంది. రాష్ట్రాలు దీన్ని అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవాలి. అవసరం అనుకుంటే ఆ అనుమతులు రద్దు చేసుకోవచ్చు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐకి ఇచ్చిన అనుమతులు వెనక్కు తీసుకుంది. ఈ నిర్ణయంతో సీబీఐ మహారాష్ట్రలో కేసులు దర్యాప్తు చేయాల్సి వస్తే ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి.
కేసును బట్టి అనుమతి ఇవ్వాలా వద్దా అన్నదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంచనుంది. ఇంతకు ముందు పశ్చిమబెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా 2018లో సీబీఐ దర్యాప్తుకు ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కు తీసుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే చేస్తోంది. దీన్ని బట్టి చాలా మంది చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పుడు మహారాష్ట్ర కూడా అనుసరిస్తోందంటూ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన కేసు ముంబై పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే తర్వాత ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.