భారీ వర్షాలకు గోదావరి ఉదృతి కొనసాగుతోంది. అధికారులు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలం వద్ద 61.40 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో ముంపు నీరు రావడం కొనసాగుతూనే ఉంది.
గోదావరి ఏరియాలో వర్షాలు ఉదృతంగా కురుస్తున్నాయి. దీంతో ఉపనదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. ప్రమాద స్థాయి మించి గోదావరి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. లంక భూములతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని పంటలు వరదలో చిక్కుకున్నాయి.
ధవళేశ్వరం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను అమలు చేస్తున్నారు. 175 గేట్లను తెరిచి 19 లక్షలకు పైగా క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అయితే ఈ స్థాయిలో ఇదివరలో ఎప్పుడూ వరద నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో వచ్చిన 1986 నాటి వరద ఇప్పుడు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రజలకు బయటకు రాలేకపోతున్నారు. వచ్చిన వారు నీటిలోనే ఇరుక్కుపోయే పరిస్థితి వస్తోంది. తెలంగాణ, ఒరిస్సా, చత్తీస్ఘడ్లకు ఏపీ నుంచి రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పునరావాస, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరదను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.