ఫేస్బుక్ పరిచయాలు ఇప్పుడు విపరీతంగా ఎక్కువయ్యాయి. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ప్రేమించుకోవడం మనం విన్నాం. అయితే ఇప్పుడు ఫేస్బుక్లో పరిచయమైన ఫ్రెండ్ కోసం ఏకంగా నేపాల్ నుంచి ఓ అమ్మాయి ఇండియా వచ్చేసింది. ఇప్పుడు పోలీసుల దగ్గర ఆమె ఉంది.
వివరాల్లోకి వెళితే.. నేపాల్ నుంచి 16 సంవత్సరాల అమ్మాయి భారత్కు వచ్చింది. ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తిని కలుసుకునేందుకు ఈ ప్రయత్నం చేసింది. మధ్య ప్రదేశ్లోని సెహోర్ జిల్లాకు వచ్చిన ఆమెను ఇక్కడి పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఖాట్మండుకు చెందిన సదరు బాలికకు సెహోర్ జిల్లా అష్టాకు చెందిన 20 ఏళ్ల ఓ యువకుడితో రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయమైందనీ.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోందని సబ్డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీఓపీ) మోహన్ శర్వాన్ తెలిపారు.
అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఖాట్మండు నుంచి విమానంలో భారత్కు వచ్చినట్టు ఆ అమ్మాయి చెప్పిందన్నారు. దేశంలోని పలు నగరాలు తిరిగి ఎట్టకేలకు శనివారం ఇక్కడికి చేరుకున్నట్టు తెలిపిందన్నారు. ఆమె చెబుతున్న ఫేస్బుక్ ఫ్రెండ్ అష్టలోని ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. ఆమె వచ్చిన విషయాన్ని ఆ యువకుడికి తెలియజేసినట్లు పోలీస్ తెలిపారు. కరోనా పరీక్షలు నిర్వహించి ఆమెను భోపాల్లోని బాలల సంరక్షణ కమిటీకి అప్పగించామని ఎస్డీఓపీ పేర్కొన్నారు. ఆమెను వెనక్కి పంపే విషయంపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.