బీహార్లో ఎన్నికల హడావిడి ముగిసినా ఎన్నికల నాటి మాటలు ఇంకా చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇచ్చినా ఎన్డీయే అక్కడ విజయం సాధించిన విషయం తెలిసిందే. తక్కువ సీట్లు వచ్చినా జేడీయూ నేత, నితీష్ కుమారే సీఎం పీఠం ఎక్కారు. అయితే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు తమదైనశైలిలో విమర్శలు చేస్తున్నాయి.
ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ ఏ విధంగా మాట్లాడారో ఇప్పుడు అదే మాటలను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపయోగిస్తున్నారు. గోపాల్గంజ్లో గుర్తుతెలియని వ్యక్తులు జరపడంతో జేడీయూ ఎమ్మెల్యే అమరేంద్ర పాండే సన్నిహితుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఘటనపై తేజస్వీ స్పందించారు. బిహార్లో శాంతి భద్రతల పరిస్థితి ‘మహా జంగిల్ రాజ్’ను తలపిస్తోందని తేజస్వి యాదవ్ తప్పుపట్టారు. జేడీయూ ఎమ్మెల్యే సహచరుడిని గోపాల్గంజ్ ఏరియాలో కాల్చిచంపిన ఘటనను ఆయన ఖండించారు.
బిహార్లో ‘మహా జంగిల్ రాజ్’ నడుస్తోందని ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. ‘నేరగాళ్ల స్వైరవిహారం, కాల్పులు, వాణిజ్యవేత్తలను బెదరించడం వంటి వాటితో రాష్ట్రంలో మహాజంగిల్ రాజ్ నడుస్తోంది. ప్రతిచోటా భయాందోళనలు, గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. శాంతిభద్రతలు మృగ్యమయ్యాయి. ముఖ్యమంత్రి డబుల్ ఇంజన్ ట్రైన్ మీద నిస్సహాయంగా కూర్చున్నారు. మహాజంగిల్ రాజ్ మహారాజు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు?’ అని తేజస్వి హిందీలో ట్వీట్ చేశారు.