ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది. దీంతో చాలా దేశాల్లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చేసేదేమీ లేక మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించేందుకు ఆయా దేశాలు సిద్దమవుతున్నాయి.
దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా విజృంభిస్తూ ఉంది. అక్కడ లక్షణాలు లేకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. గురువారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో వ్యాయామన్ని, పెంపుడు కుక్కను బయటకు తీసుకురావడాన్ని కూడా నిషేధించారు. అంతేకాకుండా ఆరు రోజుల పాటు ఇంటి నుంచి కేవలం ఒకరు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఉండనున్నట్టు అధికారులు వెల్లడించారు.
కేవలం అత్యవసర వస్తువుల కోసమే ఇంటినుంచి ఒకరు బయటకు రావాలని ఆదేశించారు. స్కూళ్లు, యూనివర్శిటీలు, కేఫ్లు, రెస్టారెంట్లను మూసివేశారు. అదే విధంగా పెళ్లిళ్లపై, అంత్యక్రియలకు హాజరవడంపై కూడా ఆంక్షలు విధించారు. ఫేస్క్మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. కఠిన ఆంక్షలను త్వరగా అమలు చేస్తేనే ఈ మహమ్మారి నుంచి త్వరగా బయటకు రావొచ్చని స్టేట్ ప్రీమియర్ స్టీవెన్ మార్షల్ తెలిపారు. దక్షిణ ఆస్ట్రేలియా జనాభా 17 లక్షలే అయినప్పటికి యూకే కంటే ఐదు రెట్టు ఎక్కువ పరిమాణంలో ఈ రాష్ట్రం విస్తరించి ఉంది.
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం మొదటి నుంచి కరోనాకు కేంద్రంగా ఉండేది. అయితే అధికారులు అక్కడ కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. గత 20 రోజుల్లో విక్టోరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ కారణంగానే దక్షిణ ఆస్ట్రేలియాలోనూ కఠిన ఆంక్షలను అమలు చేస్తే మహమ్మారి అదుపులోకి వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.