ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినీని టార్గెట్ చేసిన మోస‌గాళ్లు……

మోస‌గాళ్లు టార్గెట్ చేస్తే ఎవ్వ‌రినీ లెక్క‌చేయ‌ర‌ని తెలుస్తోంది. ఇన్నాళ్లూ సామాన్యుల‌నే టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు ఇప్పుడు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను టార్గెట్ చేస్తున్నారు. తెలివిగా మాట్లాడుతూ బుట్ట‌లో వేసుకోవాల‌నుకుంటున్నారు. తాజాగా చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినీని మోసం చేయబోయి అడ్డంగా దొరికిపోయాడు.

క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో కోవిడ్ నిధులు మంజూరు అయ్యాయ‌ని ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినీకి బాబూ జ‌గ్జీవ‌న్ రావ్ అలియాస్ తోట బాల‌నాయుడు అనే ఓ వ్య‌క్తి ఫోన్ చేశాడు. తాను స‌చివాల‌యం నుంచి కాల్ చేస్తున్నాన‌ని ఈ నిధుల‌ను రూ.25 ల‌క్ష‌ల చొప్పున 8 మందికి రుణాల కింద‌ పంపిణీ చేస్తున్న‌ట్లు చెప్పారు. అయితే ఈ నిధులు ఇవ్వాలంటే రూ. 50 వేల చొప్పున 8 మందికి క‌లిపి రూ. 4 ల‌క్ష‌లు ఆర్టీజీఎస్ ద్వారా త‌మ‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని చెప్పాడు. లేదంటే చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు ద‌క్క‌వ‌న్నాడు.

దీంతో అనుమానప‌డిన ఎమ్మెల్యే స‌ద‌రు వ్య‌క్తి గురించి ఆరా తీయ‌గా అలాంటి వ్య‌క్తి ఎవ్వ‌రూ లేర‌ని సీఎంఓ నుంచి తెలిపారు. దీంతో ఎమ్మెల్యే ర‌జినీ నేరుగా డీజీపీకి ఫోన్ చేసి విష‌యం గురించి వివ‌రించారు. అనంత‌రం రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా విశాఖ‌లో ఆ మోస‌గాడిని ప‌ట్టుకున్నారు. గ‌తంలోనూ ఈయ‌న ఇలాంటి మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. దీనిపై లోతుగా విచార‌ణ చేస్తున్నామ‌న్నారు. అయితే ఎమ్మెల్యేకు ఇలాంటి అనుభవం ఎదురైంది కాబ‌ట్టి దీని నుంచి సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డారు. ఇదే త‌ర‌హాలో సామాన్యుల‌కు ఫోన్ కాల్ వ‌స్తే తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు కూడా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here