ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన సీఎం వైఎస్ జగన్ లేఖపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. న్యాయమూర్తులపై లేఖలు రాయడం ఇదేమీ కొత్త కాదని ఆయన అన్నారు. అయితే దీనిపై ఏ విధంగా ముందుకు వెళతారన్నదే ఇప్పుడు చూడాలన్నారు.
వైఎస్ జగన్ లేఖ రాయడంపై స్పందిస్తూ ఈ అంశంలో ఏం జరుగుతుందో చూడాలన్నారు. గతంలో ఇలాంటి లేఖను వేరే వాళ్లు రాసిన సమయంలో చాలా రోజులకు దీనిపై కదలిక వచ్చిందని గుర్తు చేశారు. అయితే కేంద్రం ఈ అంశాన్ని కట్టడి చేయాలనుకుంటే చేయొచ్చని అన్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా ప్రజాసేవకు కోర్టులు అడ్డుపడుతున్నాయని భావించారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత కోర్టుల తీర్పుకు లోబడి ఎన్టీయార్ ప్రజాసేవ చేశారన్నారు. ముఖ్యమంత్రి సంజీవయ్య కూడా 1960లోనే కోర్టులపై లేఖ రాశారన్నారు.
అయితే లేఖ రాయటం కంటే జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం తప్పా.. రైటా అనే విషయం పైనే చర్చ జరుగుతోందని చెప్పారు. ఇక చట్టం ముందు జడ్జీలు అతీతులు కాదన్నారు. న్యాయవ్యవస్థలపై ఆరోపణలు విషయంలో చర్చ గౌరవంగా జరగాలన్నారు. న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి మద్య విభేదాలు వస్తే ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. మరి ఉండవల్లి వ్యాఖ్యలను బట్టి చూస్తే జగన్ న్యాయమూర్తిపై లేఖ రాయడం తర్వాత తీసుకునే చర్యలు కూడా ఆలస్యంగా ఉంటాయా అన్న సందేహం వస్తుంది. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.