ధాబాకు వెళ్లి ఫ్రీగా ఫుడ్ అడిగారు. ఇవ్వనందుకు ఏకంగా తమ వద్ద ఉన్న గన్తో కాలుస్తామని బెదిరించి కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఢిల్లీ శివారులో చోటుచేసుకుంది.
దేశరాజధాని ఢిల్లీకి ఆనుకునివున్న గ్రేటర్ నోయిడాలో సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ అక్షయ్ యాదవ్ గన్మ్యాన్ వీరంగం ప్రదర్శించాడు. భోజనం చేసేందుకు ఒక ధాబాకు వెళ్లిన గన్మ్యాన్ తన స్నేహితులతో పాటు అక్కడ నానా హంగామా చేశాడు. ఉచితంగా తమకు ఆహారం ఇవ్వలేదని ఆగ్రహిస్తూ ధాబా యజమానిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే ధాబా యజమాని వెంటనే అప్రమత్తమై, ప్రమాదం నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ నేపధ్యంలో అక్కడున్నవారెవరో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆ గన్మ్యాన్తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి నుంచి ఒక తుపాకీతో పాటు రెండు ఎస్యూవీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జైలుకు తరలించారు. కాసన్ ప్రాంతానికి చెందిన కపిల్, అమిత్లు ధాబా నిర్వహిస్తున్నారు. కాగా పోలీసు అధికారి ఈ ఉదంతంపై మాట్లాడుతూ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని సత్యేంద్ర భాటీగా గుర్తించామని,అతనికి సహకరించిన వారిని శివం సింగ్, దుర్గేష్లుగా గుర్తించామన్నారు. వీరిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.