దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడాలని చూస్తున్న మాట నిజమే అయినా ఏపీ, తెలంగాణ మాత్రం గట్టి వ్యూహాలో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవా మామూలుగా లేదన్నది అందరికీ తెలిసింది. ఇది గ్రహించిన బీజేపీ పెద్దలు పెద్ద స్కెచ్చే వేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పక్కా ప్రణాళికతోనే ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మంచి వాక్చాతుర్యం కలిగి అన్ని విషయాల్లో అందరినీ ఎదుర్కోగల సత్తా ఉన్న నేతలను పదవుల్లో కూర్చోబెట్టింది. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజుతో పాటు ఇటీవల మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి లాంటి నాయకులను రంగంలోకి దింపింది. అయితే వీరికి మామూలు బాధ్యత ఏమీ అప్పగించలేదని తెలుస్తోంది. పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేసేందుకు సర్వ శక్తులు ఒడ్డాలని క్లారిటీగా చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా 2024 ఎన్నికలే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే అధికార పార్టీ పూర్తి హుషారులో ఉంది. జగన్కు వచ్చే ఎన్నికల్లో కూడా పూర్తి మెజార్టీతో పట్టం కట్టేందుకు ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇక ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం గురించి ఆలోచించాల్సిన పనిలేదని బీజేపీ భావిస్తున్నట్లు వినికిడి. ఫోకస్ మొత్తం వైసీపీ మీదే పెట్టాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీకి సంబంధించి ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది మొదటి ఎజెండాగా ఉంది.
వైసీపీలో చేరకుండా ఉన్న మాజీ మంత్రులను సైతం పార్టీలోనికి తీసుకోవాలన్న ఆలోచన బీజేపీ చేస్తోందా అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రధానంగా టిడిపి, కాంగ్రెస్ల హయాంలో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో కొనసాగున్న వారికి ఎర వేసి పార్టీలోకి లాక్కోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా పార్టీలోకి వస్తే వారికున్న బలంతో పాటు పార్టీ ఇమేజ్ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇప్పుడున్న దానికంటే రెట్టింపు బలాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటోంది. దీనిపైనే ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఫోకస్ పెట్టినట్లు సమాచారం.