ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండగా పలు చోట్ల ఓ మోస్తరులో వర్షం కురుస్తోంది. ఈ రెండు రోజుల్లో వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చాయి. అయితే ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఉత్తరాంద్ర.. దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా ఒంపుకు తిరిగి ఉందని.. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్ర వారాల్లో కోస్తాంద్రలో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే రెండు రోజుల నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో డ్యాములన్నీ నిండుకుండలా మారుతున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికారులు గేట్లు ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు.