భారత్లో కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా టీకా విషయంలో ఊహించదగ్గ ఫలితాలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఇండియాలో కరోనా తుది దశ ట్రయల్స్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని చర్యలు వేగంగా జరుగుతున్నాయి.
ఆక్స్ఫర్డ్ టీకాకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్ను పూర్తి చేశారు. ఆక్సఫర్డ్ టీకాకు సంబంధించి రెండో దశ ఫేజ్-2 క్లీనికల్ ట్రయల్స్ను పూణెకు చెందిన భారతీ విద్యాపీఠ్ మెడికల్ కాలేజ్, కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో జరిగాయి. ఇప్పుడు మూడో దశ ట్రయల్స్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పుణెకు చెందిన సస్సోన్ జనరల్ ఆస్పత్రిలో ఈ ట్రయల్స్ జరగనున్నాయి.
అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో రెండు మూడు రోజుల్లోనే ఈ తుది దశ ట్రయల్స్ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ట్రయల్స్లో 200 మంది దాకా పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇండియా విషయానికొస్తే కరోనా కేసులు పెరుగుతున్నా రికవరీ రేటు కూడా పెరుగుతోంది. దాదాపు 80 శాతంకి చేరువలో రికవరీ రేటు ఉందని ఆరోగ్యశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి.