ప్రజారాజ్యం పార్టీ గురించి మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు జిల్లాల్లో ప్రజారాజ్యం పార్టీ తన వల్లే ఓడిపోయిందని ఒప్పుకున్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాలతో పాటు చిరంజీవి ఫ్యాన్స్ని ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
మాజీ ఎంపీ హర్ష కుమార్ ఓ టీవీ చానల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈయన జనసేనపై కూడా మాట్లాడారు. ఆయన జనసేన పార్టీలో చేరాలనుకొని ఆయన వర్గాన్నంతా జనసేనలోకి పంపినట్లు చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ తనను ఆహ్వానించడానికి వస్తారనకున్నప్పటికీ ఆయన రాలేదన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రజారాజ్యం గురించి మాట్లాడారు. గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం తనవల్లే ఓడిపోయిందని చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయంలో నెమ్మదిగా దుమారం రేగుతోంది.
గతంలోకి వెళితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 294 సీట్లకు గానూ 288 సీట్లలో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేవలం 18 స్థానాల్లోనే గెలిచింది. ఇందులో నాలుగు సీట్లు తూర్పు గోదావరిలోనే గెలిచింది. అయితే హర్ష కుమార్ మాత్రం గోదావరి జిల్లాల్లో తనవల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదు. దీంతో చిరు ఫ్యాన్స్ చిర్రెత్తిపోతున్నారు. విజయం సాధించిన చోట ఓడిపోవడం ఏంటని ఆగ్రహంతో ఉన్నారు. ఇక హర్ష కుమార్ విషయానికొస్తే వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన మరోసారి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం నుంచి హర్షకుమార్ లోక్సభకు పోటీ చేశారు. 2004, 2009లో వరుసగా ఆయన భారీ మెజార్టీతోనే గెలిచారు. ఇక 2014 ఎన్నికలకు వచ్చే సరికి కాంగ్రెస్ పార్టీ కాకుండా జై సమైక్యాంద్ర పార్టీ తరుపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 9931 ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండు సార్లు ఎంపీగా ఉన్న ఆయన కేవలం ఈ ఓట్లు తెచ్చుకోవడంపై ఇప్పుడు చిరు ఫ్యాన్స్ గుర్తుకు తెస్తున్నారు.