కర్నాటకలో సీబీఐ దాడులు చేస్తోంది. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీ.కే శివకుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన ఉన్న ఓ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సీబీఐ సోదాలు చేస్తోంది. ఒకే సారి 14 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.
కర్నాటక పీసీసీ చీఫ్ డీ.కే శివకుమార్పై మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ.డి) ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. కర్నాటకతో పాటు ఢిల్లీ, ముంబైల్లో ఒకే సారి 14 ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే సీబీఐ డి.కే శివకుమార్ ఆస్తులపై సోదాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. శివ కుమార్తో పాటు ఆయన సోదరుడు బెంగళూరు రూరల్ ఎంపీ డీ.కే సురేష్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారని సమాచారం.
బెంగళూరులోని సదాశివన నగరలో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఆస్తి వివరాలకు సంబంధించిన వివాదంలో ఆయన చిక్కుకున్నారు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జితో వారెంట్ తీసుకొని సీబీఐ ఈ దాడులకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సోదాలన్నింటినీ సీబీఐ ఎస్పీ థోమ్సన్ జోసె ఆద్వర్యంలో జరుగుతున్నాయని అంటున్నారు. ఢిల్లీలో జరుగుతున్న సోదాల్లో 60 మంది అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ నేతలు ఈ దాడులపై మండిపడుతున్నారు. సీబీఐ, ఈడీ సంస్థలతో తమను భయపెట్టాలని చూస్తున్నారని అంటున్నారు.