పోలవరం ప్రాజెక్టు విషయంలో పోలవరం అథారిటీ అత్యవసర సమావేశం హైదరాబాద్లో జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో ఇటీవల తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పెరిగిన ధరల నేపథ్యంలో నిధులు విడుదల చేసేందుకు సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్, సభ్య కార్యదర్శి రంగారెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేకాధికారి ఆదిత్యానాథ్దాస్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎస్సీ మురళీధర్ పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇటీవల వ్యయం పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అప్పటి నిర్ణయాల ప్రకారమే నిధులు ఇస్తామని చెబుతోంది. దీంతో సర్వసభ్య సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ షరతులు పెడుతున్న నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు తెలంగాణ ఏమాత్రం అడ్డుపడదని లేఖలో పేర్కొంది. తెలంగాణలో ముంపు సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రం, ఏపీదేనని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా తెలిపింది. ప్రాజెక్ట్ నిండితే కిన్నెరసాని నదిలోకి వరద వస్తుందన్నారు. బూర్గంపాడు మండలంలో 45 వేల ఎకరాలకుపైగా ముంపు ఉంటుందని పేర్కొంది. భద్రాచలం, దేవాలయానికి నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది.