దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా మారిన బీహార్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరి కొద్ది గంటల్లోనే బీహార్ సీఎం ఎవరో తేలిపోనుంది. అయితే ఇప్పటికే అన్ని సర్వేలు మహాగట్బంధన్దే గెలుపని తేల్చిచెప్పాయి. కాగా నేడు అందరి నోటా సీఎం తేజస్వీయాదవ్ అన్న మాట వినిపిస్తోంది.
నవంబర్ 9న తేజస్వీ పుట్టిన రోజు. దీంతో బీహార్లో ఇప్పటికే ఓ సందడి వాతావరణం నడుస్తోంది. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి తేజస్వీ అంటూ అభినందనలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇండియా ట్విట్టర్ ట్రెండింగ్లో తేజస్వీ పేరు ప్రధానంగా వినిపించింది. ఈరోజు తేజస్వీ పుట్టినరోజు మాత్రమే కాకుండా, రేపే బిహార్ అసెంబ్లీ ఫలితాలు రాబోతుండడం.. పైగా సర్వేలు అన్నీ మహాకూటమికి అనుకూలంగా ఉండడంతో తేజస్వీ పుట్టినరోజుకు మరింత ఆదరణ లభించింది. ఇండియా టాప్ ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ట్యాగుల్లో తేజస్వీ పేరుతోనే నాలుగు హ్యాష్ట్యాగ్లు సందడి చేశాయి.
అందులో ‘‘ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్’’ అనే హ్యాష్ట్యాగ్ ప్రధానంగా కనిపించింది. తమ అభిమాన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఆభిలాషలో ఆ శుభాకాంక్షలు కూడా ముందుగానే చెప్పేస్తున్నారు నెటిజెన్లు. మహాగట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విస్తృత ఎన్నికల ప్రచారం చేసిన తేజస్వీకి ప్రజల నుంచి విశేషమైన ఆధరణ లభించింది. ఓ వైపు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ లాంటి హేమాహేమీలకు ఏమాత్రం తీసిపోకుండా ఎన్నికల ప్రచారంలో తేజస్వీ దూసుకుపోయారు. ఒకానొక సమయంలో రోజుకు 10-15 ర్యాలీలతో బిహార్ రాజకీయాల్లో కాక పుట్టించారు.