ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టిడిపి నేత బోండా ఉమ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నవరత్నాలు నవమోసాలుగా మారిపోయాయన్నారు. చంద్రబాబు ఎనిమిది లక్షల ఇళ్లను ఆధునిక వసతులతో నిర్మించారని, రంగులు వేసి ఇచ్చే స్థాయిలో ఉన్న ఇళ్లు పేదలకు ఇవ్వడానికి జగన్కు మనసు రావడం లేదని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వానికి జనవరి వరకు సమయం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. అప్పటిలోగా పేద వాళ్ల కోసం తెలుగుదేశం హయాంలో నిర్మించిన ఇళ్లను అందజేయాలని..లేదంటే తామే పేద ప్రజలతో వెళ్లి గృహ ప్రవేశం చేస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 17 నెలలు అయినా.. ఒక్కరికైనా ఇల్లు కట్టించారా అని ప్రశ్నించారు. లబ్ధిదారులు 25వేల నుంచి లక్ష రూపాయలు వడ్డీలకు తెచ్చి కట్టారని, జగన్ మాయ మాటలు నమ్మి ఓటేస్తే.. నయ వంచన చేశారన్నారు. కోర్టులో కేసులు ఉన్నాయనే పేరుతో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చేయాలని జగన్ కుట్రలు చేస్తున్నారన్నారు. 17 నెలల్లో ఏమీచేయకుండా వైసీపీ నేతలు ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసమర్ధ పాలనతో రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించారని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేస్తుందని బోండా ఉమ స్పష్టం చేశారు.
సెంటు స్థలం పేరుతో శ్మశానాలు పొలాలల్లో కేటాయిస్తారా అని బోండా ఉమ ప్రశ్నించారు. ఐదు వేలు ఖరీదు కూడా చేయని సెంట్ స్థలం కోసం ఊరుకి దూరంగా 40 కీ.మీ. వెళ్లాలా అని నిలదీశారు. పేదలకు సెంట్ స్థలం పేరుతో వైసీపీ నేతలు నాలుగువేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు చూపినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎకరం ఇరవై లక్షలు ఉన్నచోట అరవై లక్షలు ప్రభుత్వ ధనాన్ని చెల్లించి కాజేశారని ఆరోపించారు.